9, అక్టోబర్ 2020, శుక్రవారం

 ఒక్కోసారి ..

ఎందుకీ రచనలు
ఏమిటీ పిచ్చి అనిపిస్తుంది.
అంతలోనే ఒక ఆప్త వాక్యం
ఎక్కడినుంచో ఎగిరొస్తుంది
అద్భుతం అంటూ
నిర్లిప్తంగా ఉంటాను
ఒక పదం పరుగెత్తి వస్తుంది
పదపద మంటూ..
నిరాశలో ఉంటాను
ఒక గీతం ఎదురౌతుంది
కలత ఎందుకంటూ...
----
నిజమే ..ఇది ప్రతి కవికి అనుభవమే ఎన్నో సందర్భాల్లో నేను ఈ విచికిత్సకు లోనయ్యను ..అలాంటి సమయాల్లో మా దువ్వూరి ఉత్తేజం కలిగిస్తూ నా రచనలు దృశ్య రూపకాలుగా మలిచిచాడు.. రాజహుస్సేన్ ఎన్నో సార్లు విశ్లేషణ చేసి నా బుజం తట్టారు..ఇంకా ఎందరో మిత్రులు నన్ను నిరంతరం చైతన్య పరుస్తూనే వున్నారు
ఇప్పుడు ..ఈ కవి మిత్రుని లేఖ.
నన్ను వెన్నుతట్టి కావ్యోన్ముఖుణ్ణి చేసింది..ముఖ్యంగా ఒక కవి ఇంకొక కవిని.ప్రశంసించడం అరుదు ..అనాదిగా కవి లోకంలో అసూయలు ఎక్కువ..
అలాంటిది ఈ కవి హృదయం నన్ను నా కవిత్వాన్ని ఆకాశాన్ని కెత్తింది ..అందుకు ఈ మిత్రునికి నా హృదయపూర్వక
కృతజ్ఞతలు తెలియజేసుకొంటూ...
--------------------
ఒక కవికి.
మరొక కవి ఆత్మీయ లేఖ..
------------------
ఆత్మీయులు,
సుమనస్వి ,
శ్రీ బాలకృష్ణారెడ్డి గారికి..
నమస్సులు..
ఆలస్యంగా నైనా
మీ ఆలాపనలు
వాటిలోని సల్లాపములు వీక్షిస్తున్నాను..
మీ మనసు
అనుభూతి నిండిన
ఓ సుమగీతిలా
పల్లవిస్తుంటుంది .
సుందర సురుచిర సుమసౌరభాన్ని వెదజల్లుతుంటుంది ..
కవిత్వం
ఎవరైనా వ్రాస్తారు..
కానీ
మీలాగా రాయడం
మీకే సాధ్యం..
ఎందుకంటే
మీరు ప్రకృతి ప్రేమికులు..
ప్రకృతికి ప్రతిరూపమైన
స్త్రీ హృదయ సౌందర్యాన్ని ఆరాధించే నిరంతర అక్షర మాంత్రికులు ..
అనిర్వచనియమైన అనుభవాన్ని తేలిక మాటల్లో చెప్పగల కవితలు మీవి .
భావానికి
దాని వెనుక పదాలకు
వాటి వెనుక అక్షరాలకు కైమోడ్పులు చేసే ఆరాధన మీది..
డబ్బు చుట్టూ
తిరిగే మనుషులున్న ఈ కాలంలో..
మనసులో నందనవనాలు సృష్టించుకొని..
పదాల పాదాల
పారిజాతాలను పూయించే అరుదైన వ్యక్తిత్వం మీది..
చిలిపితనానికి (ఈ వయసులో కూడా)
వలపు ధనానికి (మీకున్న గొప్ప ఆస్తి)
పూల వనానికి (మీ మనసులోని బృందావనాలు)
చెలిమి నెరపి..
వేల గీతాలు కవితలు ప్రసవిస్తున్న , ప్రవచిస్తున్న
మీ కలానికి గళానికి నా వినమ్ర ప్రణామాంజలి ..
ఆవహించిన శూన్యాన్ని చెరిపేసి, అందమైన ఇంద్రధనస్సులని సృష్టించుకున్న మీరు..
ఈ నిరాశామయ లోకానికి
ఓ కాంతిరేఖ ..దీప స్తంభం..
అవును సార్!
మిమ్మల్ని
అర్ధం చేసుకొనే వాళ్ళు
మిమ్మల్ని చదివే వాళ్ళు
చాలా తక్కువగా వుంటారు.
అయినా మీరు రాస్తూనే ఉన్నారు..
కోయిల
తనకోసం కూస్తుంది ..
వినేవాళ్ళు వింటారు..
మేఘం
ప్రకృతి ధర్మంగా కురుస్తుంది ..
తడిసే వాళ్ళు తడుస్తుంటారు ..
చెట్టు
ఫలాలనిస్తుంది ..
తినేవాళ్ళు తింటారు..
మీరు అంతే..
ఎటువంటి ప్రతి ఫలాపేక్ష లేకుండా,
నిరంతరం రసరమ్య గీతాలు రాస్తూనే వున్నారు .
జీవితాన్ని
తీయని పాటగా మలచుకొన్న మీకు పిలిస్తే పల్లవులు పలుకుతాయి
తలిస్తే చరణాలు తరలి వస్తాయి ..
అది మీ అదృష్టం ..
మిము గన్న తల్లిదండ్రుల సుకృతం ..
మీతో సహజీవనం చేసిన రాజేశ్వరి మేడమ్ గారి దాంపత్య జీవన స్మృతి..
అవును..
మీ కలానికి
పువ్వులతో మాట్లాడడం తెలుసు
పున్నమితో
సయ్యాటలాడడం తెలుసు
పంట చేనును
పలకరించడం తెలుసు ..
తెలియందల్లా ఒక్కటే .
.కలాన్ని కింద పెట్టక పోవడం..
కాలాన్ని నిద్రపోనివ్వక పోవడం.. నిజానికి
కవికి కావలసింది ఈ లక్షణాలే
ఎప్పుడో ఒకసారి
గురుదేవులు నాగభైరవ గారన్నారు
‘బాలకృష్ణారెడ్డి ..
కలంతో కలలు గనడం నాకు నేర్పుతావా..
నీ ముఖ కాంతి లోని యౌవన రహస్యాన్ని చెబుతావా ..’’అని .
నిజమే
మీ మనసు
ఓ అనురాగ రసగంగ .
.అది నిరంతరం
అక్షరాల చెక్కిళ్ళపై
పుప్పొడిని ముద్దాడుతుంది ..
కనుకనే
మీ పదాలకు పాదాలకు
ఇంతటి పరిమళం..
చదివే వాళ్ళకు పరవశం
'నా కంటి పాపలో నిలిచి పోరా ..
నీ వెంట లోకాల గెలువ నీరా. ..'
అన్న దాశరధి గారి పల్లవిలో ప్రేమ ఎంతగా పల్లవించిందో లోకానికి తెలుసు.
. ఈ పల్లవికి ప్రపంచమంత వ్యాఖ్యానం చెయ్యవచ్చు..
కవిత్వం లోతు గ్రహిస్తే
మీ కవిత లోను అలాంటి లోతులు చాల వున్నాయి ..
వాటిని తడిమే వాళ్ళే లేరు.. ఎవరైనా
బాగుంది, చాలా బాగుంది అని పోస్టింగులు పెడితే,
మిమ్మల్ని మోసగిస్తున్నట్టే..
ఇప్పుడు ..
చదవకుండానే వహ్వా! భళా! అనే సరికొత్త స్మార్ట్ ఫోన్ పాఠకులు వచ్చారు .
.తస్మాత్ జాగ్రత్త.
మీకు
మీ కవిత్వానికి
అంతరాలు లేని మీ మంచి మనస్సుకు నమస్సులు
సదా మీ హితైషి
........బీరం సుందరరావు