27, అక్టోబర్ 2017, శుక్రవారం

విత్వం ఎవరికోసం 
----------------------------------------------
సభలు వెలవెల
కవులు విలవిల
కవిత్వం ఒక కఠిన శిల
--------------------------------------

ఈ మాటలు కటువుగా ఉండొచ్చు 
కవులరా మన్నించండి అపార్ధం చేసుకోకండి 
ఇది నా మాట కాదు నా ఒక్కరి భాష్యం కానే కాదు నా అనుభవం 
సభలకు అరుదెంచే ఎందఱో సభికుల తీవ్ర స్వరం 
పట్టుమని పదిమంది కూడా కనిపించని సభల వైనం 

ఒకనాడు జనం ఆబాలగోపాలం వేలంవెర్రిగా ఒకచోట గుమిగూడే వాళ్ళు 
గుంపులుగుంపులుగా ఒక చోట చేరే వాళ్ళు 
పురాణాలు పారాయణాలు ఆదమరచి వినేవాళ్ళు
పద్య నాటకాలు బొమ్మలాటలు బుర్రకధలు భాగవతాలు వినే వాళ్ళు 
నాటకాలు వేసేవాళ్ళు చూచేవాళ్ళు పరవశతో ఊగిపోయెవాళ్ళు 

కాలం మారిపోయింది 
రెండు మూడుదశాబ్దాల కావల ప్రముఖ కవులు పాల్గొంటున్న 
సాహిత్య సభలకు పిలవకుండానే పరుగుపరుగున వచ్చిన జనం 
ఇప్పుడు దుర్భిణి వేసి వెదికినా కనిపించడం లేదు 
స్వయంగా ఇళ్ళకు వెళ్లి పిలిచినా రావడం లేదు 
వచ్చినా పట్టుమని పది నిముషాలు కూర్చోవడం లేదు 
ఏదో పాపం పిలిచాడు పిచ్చివాడు ‘ రాకపోతే బాగుండదు 
అనివచ్చి పలకరించి మొదలు పెట్టగానే 
కొండొకచో ముందుగానే మాయమయ్యే వాళ్ళే 

ఇది కవుల తప్పిదమా 
కవిత్వం ప్రజలకు దూరం కావడమా 
అసలు తెలుగు భాషనే మరచి పోవడమా 
మనిషిలో ఆర్ద్రత కళాతృష్ణ మాయం కావడమా 
జీవనరాగం మరచి మనిషి ఎండమావులవెంట సంచరించడమా 
లేక ఇది కాలం చేసిన మాయాజాలమా

ఏది ఏమైనా కవిత్వానికి కాలం చెల్లిపోయింది 
కొందరి కవిత్వం నారికేళ పాకమయితే 
కొందరిలో కవితా పరిమళమే లేకపోడం ఆ కవిత్వం ఆకట్టుకోలేక పోవడం 
ఈనాటి కవిత్వం శ్రోతల్ని పాఠకుల్ని దూరం చేసుకుంది 
కనీసం ప్రజలకోసం ప్రజల భాషలో 
నాలుగు మాటలు రసరమ్యంగా చెప్పేవారు కరువయ్యారు 
రాసింది ఏదయినా ప్రజలు చదివే అవకాశం లేకుండా 
కవులు మాయ మర్మం రంగరించి రచనలు చేస్తున్నారు 
సభలు వెలవెల బోతున్నాయి 
నేడవి గొప్పలు చెప్పుకునే వేదికలుగా మారాయి 
పొగడ్తలు పురస్కారాలకు ఫోటోలకు తెల్లారి పత్రికలలో వార్తలకు పరిమితమయినాయి 

జనం జాలిపడుతున్నారు అటు తిరిగి నవ్వుకొంటున్నారు 
ఇదొక వెర్రి అని చాదస్తమని దీనిని కాలం చెల్లిన ప్రక్రియగా తలపోస్తున్నారు 
అయినా కవికి ఈ నిజం నచ్చడం లేదు ఈ సత్యం మింగుడు పడడం లేదు 
కవిత్వం కవులకోసమే అనుకొంటున్నారు 
పాఠకులు తమదాకా ఎదగాలని కవులు భావిస్తున్నారు 

వారి భాషలో రచనలు చేయాలి 
వారి మనసులలోకి దూరి మలినాలను ఏకరవు పెట్టాలి 
అతని నడకను ప్రశ్నించాలి 
అందుకు కవులు నడుం కట్టాలి నడకను మార్చుకోవాలి 
వాళ్ళు మీ దాకా ఎదగడం కాదు మీరే నేలదిగి రచనలు చెయ్యాలి 
మాయామర్మం వదలిపెట్టి నేరుగా మనిషిలోకి వెళ్ళాలి 
సూటిగా తగలాలి అతనిలో మార్పు తేవాలి 
అప్పుడే ఏ కవిత్వానికయినా అర్ధం పరమార్ధం 
ఎవరిని కించపరచాలని కాదు ఈ రచన ధ్యేయం 
మనం కళ్ళు తెరవాలని 
జనం కళ్ళు తెరిపించే సులభమయిన రచనలు రావాలని 
కవులందరికీ ఇది అనుభవైక వేద్యమే 

ఈ నాడు కవి కాళిదాసు వాల్మీకి ఎవరికీ అర్ధం కావడం లేదు 
ఆనాటి సంస్కృత పారాయణం ఇప్పుడు లేదు 
ప్రాచీన గ్రంధాలు ప్రబంధాలు చదవడం లేదు 
తర్వాతి కాలం వారైన నన్నయ తిక్కన ఎర్రన పోతన శ్రీనాధులు 
నిన్నటి శ్రీశ్రీ గురజాడ నేటి సినారే సైతం ఈ తరానికి అంతగా తెలియదు 
కాలం మారిపోయింది చదివే గుణం నశించి, చూచే తనం వచ్చింది 
జనంలోకి వెళ్ళాలంటే మనము మారాలి -లేకుంటే మీ ఇష్టం 

ప్రియమైన కవులారా !
కవులకోసం పురస్కారాల కోసం 
పొగడ్తల కోసం ఫోటోల కోసం బిరుదులకోసం 
మీ కవిత్వం మీరు రాసుకోండి 
కాని కదిలేది కదిలించేది పెను నిద్దుర వదిలించేది 
అన్న ఆ మహాకవి మాటల్ని మాత్రం విస్మరించకండి 

తెలుగు నేల, 
భాష సంస్కృతులు మరచి ఎండమావిలా మారుతున్న వేళ 
రానున్న కాలంలో తెలుగన్నదే మటుమాయ మౌతున్న వేళ 
గుండె బరువుతో ఈ మాటలు రాస్తున్నాను 
నిజం నిష్టురంగానే ఉంటుంది, వాస్తవం కఠినంగానే ఉంటుంది 
మానవత్వం కోల్పోతున్న మనిషిని మరమ్మతు చేసే కర్తవ్యం 
సమాజాన్ని సరైన మార్గంలో నడిపించే ధర్మం అగత్యం 
కవులు నెత్తికెత్తుకోవలసిన అవసరం ఎంతయినా ఉన్నది 
అందుకు అటువైపుగా కలాలు కదిలించమని వేడుకొంటున్నాను

వేలకొద్ది కవులు వందలకొద్దీ సంఘాలు 
సభలు సమావేశాలు చూచిన పాల్గొన్న నేపధ్యంలో 
ఆ దిశగా అడుగులు వేయమని ప్రార్ధిస్తున్నాను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి